రూ.10 లక్షల కోట్ల అప్పు.. విజయ్ ప్రభుత్వానికి అన్నామలై కీలక సూచన

  • ఆర్థికవేత్తలు, నిపుణులతో సంప్రదింపుల బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
  • రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటాయని శ్వేతపత్రంలో వెల్లడి
  • 2031 నాటికి పని చేసే వయసు జనాభా తగ్గనుందని, ఇప్పుడే చర్యలు తీసుకోవాలని హెచ్చరిక
తమిళనాడు రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఈ విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులతో కూడిన ఒక ఉన్నతస్థాయి సంప్రదింపుల బృందాన్ని ఏర్పాటు చేయాలని 'వుయ్ ది లీడర్' వ్యవస్థాపకుడు కె. అన్నామలై రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ఇటీవలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో అన్నామలై ఈ ప్రతిపాదన చేశారు.

ప్రభుత్వం జూన్ 16న విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం, తమిళనాడు ప్రత్యక్ష అప్పులు దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరాయి. ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రం మొత్తం అప్పు రూ.13.18 లక్షల కోట్లుగా ఉంది. రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయంలో 22.8 శాతం కేవలం వడ్డీల చెల్లింపులకే వెచ్చిస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. గత ఐదేళ్ల కాలంలో జరిగిన ఆర్థిక దుర్వినియోగానికి ఈ శ్వేతపత్రం ఒక 'పోస్ట్‌మార్టమ్' లాంటిదని జూన్ 19న అన్నామలై వ్యాఖ్యానించారు.

ఈ నివేదికను కేవలం ఒక సాకుగా చూపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదని, తక్షణ దిద్దుబాటు చర్యల చేపట్టేందుకు దీనిని ఒక మార్గసూచిగా పరిగణించాలని ఆయన హితవు పలికారు. 2031 నాటికి తమిళనాడులో పనిచేసే వయసున్న జనాభా క్రమంగా తగ్గనుందని, ఇది అత్యంత ఆందోళనకరమైన విషయమని అన్నామలై హెచ్చరించారు. రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవడానికి, అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వానికి గడువు చాలా తక్కువగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

K Annamalai
Vijay TVK Government
Tamil Nadu Debt Crisis
Tamil Nadu Economic White Paper

More Telugu News